
- సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లి వద్ద స్వల్ప ఉద్రిక్తత
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామ శివారులో రంగనాయక్ సాగర్ కాల్వ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్ డి3 కాల్వలోకి సాగునీటి మళ్లింపు కోసం చేపట్టిన పనులను నంగునూరు మండల రైతులు అడ్డుకున్నారు. శనివారం చేర్యాల,- నంగునూరు మండల సరిహద్దులోని కమలాయపల్లి వద్ద ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి కమలాయపల్లితో పాటు దానంపల్లి, అర్జునపట్ల, ఆకునూరు, లింగాపురం, దూల్మిట్ట గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
ఈ విషయాన్ని మాజీ జడ్పీటీసీ గిరికొండల్రెడ్డి రెండు రోజుల కింద భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మంత్రి ఉత్తంకుమార్రెడ్డికి వివరించడంతో.. డి10 కాల్వ నుంచి తాత్కాలికంగా పైప్లైన్ వేసి సాగునీటిని తపాసుపల్లి రిజర్వాయర్ డి3 కెనాల్లోకి మళ్లించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందులోభాగంగా అధికారులు మళ్లింపు పనులు ప్రారంభించగా, నంగునూరు మండల రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. నంగునూరు మండలంలోని పది గ్రామాలకు సాగునీరు అందదని, ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేర్యాల పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించడంతో ఆందోళన విరమించారు.