
- హైదరాబాద్ వేదికగా మే నెలలోమిస్ వర్డల్ పోటీలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దశదిశలా చాటేందుకు మిస్ వరల్డ్ పోటీలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు పర్యాటక రంగానికీ ఊతమిచ్చేందుకు ఇదో అవకాశంగా మలుచుకోవాలనే ప్లాన్లో ఉంది. హైదరాబాద్ లో మే 7 నుంచి 31 వరకు మిస్ వర్డల్ పోటీలు నిర్వహించనున్నారు.
ఇందు కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోటీలకు రూ.55 కోట్లు కేటాయించింది. వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు ఈ నిధులతో సకల సౌకర్యాలు కల్పించబోతోంది. మిగిలిన ఖర్చును మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు భరించనున్నారు. దాదాపు 140 దేశాల నుంచి 140 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
వివిధ దేశాల నుంచి పోటీదారులతోపాటు మీడియా ప్రతినిధులు, ఆయా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిని తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం వేదికలు రెడీ చేస్తున్నారు.
20 పర్యాటక ప్రాంతాలపై ప్రమోషన్
మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులకు హైదరాబాద్, పోచంపల్లి, ఓరుగల్లు, సిరిసిల్ల , నాగార్జునసాగర్ కొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక, కళాత్మక ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగుళాంబ లాంటి ప్రముఖ టెంపుల్ సిటీస్ చూపించనునక్నారు.
అలాగే.. అమ్రాబాద్, కవ్వాల్, అనంతగిరి, లక్నవరం లాంటి పర్యాటక స్థలాలను కూడా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో టూరిజంకు భారీగా ప్రమోషన్ లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.