సమ్మర్​ యాక్షన్​ ప్లాన్ .. ఆరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు

సమ్మర్​ యాక్షన్​ ప్లాన్ .. ఆరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
  • శ్రీశైలం రిజర్వాయర్​లో 850 అడుగుల వద్ద నీరు
  • పొదుపుగా వాడుకోవడంపై ఆఫీసర్ల నజర్

నాగర్​కర్నూల్, వెలుగు:  వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మిషన్​ భగీరథ అధికారులు ఈ నెల మొదటి వారం నుంచే సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తున్నారు. ఆరు జిల్లాలు,19 అసెంబ్లీ నియోజకవర్గాలు,3,200 పైచిలుకు గ్రామాలకు వేసవిలో తాగునీటి కొరత రాకుండా ఇరిగేషన్​ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. శ్రీశైలం రిజర్వాయర్​లో ప్రస్తుతం 850 అడుగుల వరకు నీటి నిల్వలు ఉన్నాయి.

 ప్రస్తుతం ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు వాడుకునేలా ప్రధాన శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎంవో ఆదేశించింది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​ను సిద్ధం చేసుకున్న భగీరథ అధికారులు గ్రామాలు, మున్సిపాలిటీల్లో బోర్లు, డైరెక్ట్​ పంపింగ్​ మోటార్ల లెక్కలు తీశారు. ఈ ఏడాది ఆరు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామని భగీరథ గ్రిడ్​ ఇంట్రా ఈఈ సుధాకర్ సింగ్  తెలిపారు.

అధికారుల ప్రత్యేక దృష్టి..

 కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​లో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్​ నుంచి ఎల్లూరు డబ్ల్యూటీపీకి, అక్కడి నుంచి గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్​ పహాడ్, కమ్మదనం, రాఘవాపూర్​ డబ్ల్యూటీపీ(వాటర్  ట్రీట్​మెంట్  ప్లాంట్)కి రా వాటర్  సప్లై చేస్తున్నారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలు, ఇతర ఆవాసాలకు సరఫరా చేస్తారు. వేసవిలో ఉమ్మడి మహబూబ్​నగర్, వికారాబాద్​ జిల్లాల్లో తాగునీటి అవసరాలను అంచనా వేసిన అధికారులు  జూన్​ వరకు నాలుగు నెలల పాటు శ్రీశైలం రిజర్వాయర్​లో నీటి నిల్వలు డెడ్​ స్టోరేజీకి చేరకుండా ఇప్పటి నుంచే ప్లాన్​ చేసుకున్నారు. మిషన్​ భగీరథ ద్వారా వీలైనంత వరకు తాగునీటిని సరఫరా చేసి అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే 37 డిగ్రీలకు ఊష్ణోగ్రతలు చేరడంతో భూగర్భజలాల సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో నీళ్లు వృథాను తగ్గించేందుకు లీకేజీలు, ఓవర్​ ఫ్లో సమస్యలు రాకుండా చూస్తున్నారు.

గత ఏడాది అనుభవాలతో..

గత ఏడాది  కృష్ణా బేసిన్​లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.  శ్రీశైలం రిజర్వాయర్​లోకి అంచనాకు తగ్గట్లుగా నీళ్లు రాలేదు. ఈ సారి రికార్డు​స్థాయిలో శ్రీశైలం రిజర్వాయర్​లో వరద నీరు వచ్చి చేరింది. ఏడు సార్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎల్లూరు రిజర్వాయర్​ కెపాసిటీ తక్కువగా ఉండడంతో లిఫ్ట్​ చేసిన నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేకపోవడం సమస్యగా మారింది. తాగునీటి అవసరాలకు బ్యాక్​ వాటర్​  నుంచి నీటిని లిఫ్ట్​ చేసి ఎల్లూరు రిజర్వాయర్  నుంచి మొదటి డబ్ల్యూటీపీకి ఎత్తి పోస్తున్నారు. అక్కడి నుంచి ఆరు జిల్లాల్లోని డబ్ల్యూటీపీలకు నీటి పంపింగ్​ జరుగుతోంది.

నీటి పొదుపు అవసరం..

ఎండల తీవ్రత దృష్ట్యా మిషన్  భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటి వినియోగంలో పొదుపు తప్పదని అంటున్నారు. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో భగీరథ నీటిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఇంట్రా పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం, అసంపూర్తి పైప్​లైన్లు, నల్లా కనెక్షన్ల కారణంగా శుద్ధి చేసిన నీరు డ్రైనేజీల పాలవుతోంది. మున్సిపాలిటీల్లో కమర్షియల్​ కనెక్షన్లు తీసుకుని వాటర్​ సర్వీసింగ్​ యూనిట్లు నడిపిస్తున్నారు.

ఇరిగేషన్​ అధికారులపైనే భారం..

కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటా మేరకు నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉండడంతో,  లిఫ్ట్​లు, చిన్న రిజర్వాయర్లతో సాగునీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరడం లేదు. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ) భగీరథకు కేటాయించిన నీటి వాటాతో మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్​కర్నూల్, వికారాబాద్​ జిల్లాల్లో మంచినీటి కొరత రాకుండా శ్రీశైలం రిజర్వాయర్​లో నీటి నిల్వలు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్​ అధికారులపై ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్ఈలకు ఇన్​చార్జి సీఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించి వేరే జిల్లాలకు పంపించారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఈఈలపై సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే బాధ్యత ఉంది.