
నారాయణ్ ఖేడ్, వెలుగు : మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను అధికారులు త్వరగా కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ఆఫీసులో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిండానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కృషి చేయాలన్నారు. మీటింగ్ లో ఎంపీపీ చాందినీ బాయ్, జడ్పీటీసీ లక్ష్మీబాయి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
కాగా మండలంలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు 12 మంది కలిసి ఎంపీపీ చాందినీ బాయ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.12 మంది ఎంపీటీసీల నుంచి ఇద్దరు ఎంపీటీసీలు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో చేరారు. దీంతో వారి సంఖ్య పదికి తగ్గింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సరైన బలం లేకపోవడంతో అవిశ్వాసానికి తెరపడింది.
సాదాసీదాగా మండల సమావేశం
జోగిపేట,వెలుగు : అందోల్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షులు బాలయ్య అధ్యక్షతన సోమవారం సాదాసీదాగా జరిగింది. ఎజెండా ప్రకారం అధికారులు వారి వివరాలు సభ ముందు ఉంచారు. ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా గ్రామాలలో సభలు కొనసాగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఇందులో 17 ప్రభుత్వ శాఖలు పాల్గొంటాయని వివరించారు. సర్పంచ్, ఎంపీటీసీలు సహకరించాలని కోరారు. వ్యవసాయాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో రైతుబీమాకు సంబంధించి మొత్తం 37 మందికి గాను 33 మంది రైతులకు డబ్బులు ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. చివరి సమాసవేశం కావడంతో సభ్యులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.