రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం దామరచర్ల మండల కేంద్రంలో ప్రజాపాలనలో ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులను డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి స్వీకరించి అధికారులకు అందజేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోకలెక్టర్ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, రైస్ మిల్లర్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.