![ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం : ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mla-dr-rajesh-reddy-made-surprise-inspection-of--markandeya-pump-house-and-inspected-works_vzlfP0wJCV.jpg)
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే సర్కార్ లక్ష్యమని, ఎక్కడికక్కడ కాలువలను తీయించి సాగునీటిని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. మండలంలోని శాయిన్ పల్లె శివారులోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మార్కండేయ పంప్ హౌస్ ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువల పనులను సకాలంలో పూర్తిచేసి రెండు పంటలకు సాగునీరు అందేలా చూడాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పార్థసారథి, శివరాం లను ఆదేశించారు.
పంప్ హౌస్ ద్వారా ఎర్రకుంట, ఊర చెరువులను నింపి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించి రైతుల కండ్లల్లో ఆనందం నింపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతులను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, శంకర్, అమృత్ రెడ్డి, వెంకటస్వామి
ఉన్నారు.