
మదనాపురం/కొత్తకోట, వెలుగు: కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులు, ఎత్తిపోత పథకాలు నిర్మించడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మదనాపురం మండలం తిరుమలాయపల్లి వద్ద ఉన్న బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజి–1, సరళసాగర్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద పూజలు దిగువకు నీటిని విడుదల చేశారు. కొత్తకోట మండలం బీమా ఫేజ్–1 నుంచి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తుగా వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు జిల్లాలోని అన్ని లిఫ్ట్లకు సాగునీటిని అందించి బీడు భూమును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని రైతులంతా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు కాంగ్రెస్ పార్టీ దశబ్దాల నుంచి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరులో భారీ ప్రాజెక్టులను నిర్మించిందని తెలిపారు. జూరాల, శంకరసముద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఎంపీపీ జన్ను పద్మావతి వెంకటనారాయణ, నాగన్న, కృష్ణారెడ్డి, రామకృష్ణ, పల్లెపాగ ప్రశాంత్, బీచుపల్లి, మేస్ర్తీ శ్రీను, పీజే బాబు, రావుల జితేందర్నాథ్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.