చిన్నచింతకుంట, వెలుగు : కొత్తగా ఏర్పాటైన కౌకుంట్ల మండల కేంద్రంలో అన్ని సౌలతులు కల్పిస్తామని, అవసరమైన బిల్డింగులను నిర్మిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంపీడీవో ఆఫీస్ను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఎంపీడీవోను తన చాంబర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా, మండల ఏర్పాటుకు గెజిట్ లేకుండా తూతూ మంత్రంగా కౌకుంట్ల మండలాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆఫీసర్లు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెవెన్యూ మంత్రిని కలిసి మండల ఏర్పాటుపై గెజిట్ విడుదల చేయించామని చెప్పారు.
ఎంపీడీవో ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో తహసీల్దార్, ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తహసీల్దార్ కృష్ణయ్య, కురుమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ గోవర్దన్ రెడ్డి, లీడర్లు అరవింద్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.