
మదనాపురం, వెలుగు: అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.
పైలెట్ ప్రాజెక్టు కింద దంతనూరు గ్రామంలో రూ. 3 కోట్లతో మొదటి విడతగా60 ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగన్న, నాయకులు జగదీశ్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.