![విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు](https://static.v6velugu.com/uploads/2025/02/mla-gandra-satyanarayana-rao-refute-opposition-criticisms-on-bc-caste-census-and-sc-reservation_fB0cQzaRmM.jpg)
రేగొండ, వెలుగు: బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్లపై విపక్షాలు చేస్తున్న పసలేని విమర్శలను తిప్పికొట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీసీ కులగణన విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడారు. ఎస్సీల్లో 36 కులాలు ఉండి వర్గీకరణ జరగక ఏళ్ల తరబడిగా వెనకబడి పోయాయన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే బీసీ కులగుణన విజయవంతం చేయడంతో పాటు ఎస్సీవర్గీకరణ చేస్తామన్న మాట నిలుపుకుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వు అమలు చేస్తున్న పథకాలను ప్రతి గ్రామంలో చర్చ పెట్టి ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, పీఏసీఏస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, పత్తి ప్రభాకర్, నాయకులు మ్యాకల భిక్షపతి, జంగటి సుధాకర్, బొజ్జం రవి, పొనుగోటి వీరబ్రహ్మం, పున్నం రవి తదితరులు పాల్గొన్నారు.