
జైనథ్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కు సొంత మండలంలోనే నిరసనల పరంపర కొనసాగుతోంది. మొన్న జైనథ్ మండల కేంద్రంలో, నిన్న గూడ, భోరాజ్ గ్రామాల్లో, నేడు పార్డి గ్రామాల్లో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు పార్డి (బి ) గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగిలింది.
పార్డి, రామాయి గ్రామాల మధ్య గల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్లకార్డులు పట్టుకొని గో బ్యాక్. గో బ్యాక్. ఎమ్మెల్యే గో బ్యాక్ అని నినాదాలు చేసి నిరసనని వ్యక్తం చేశారు. గతంలో వంతెన నిర్మిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడంతో గ్రామస్తులు నిరసనని తెలిపారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు.