అవినీతి అధికారులకు ఇక్కడ స్థానం లేదు : కడియం శ్రీహరి

అవినీతి అధికారులకు ఇక్కడ స్థానం లేదు : కడియం శ్రీహరి

ధర్మసాగర్​(వేలేరు), వెలుగు : అవినీతికి పాల్పడే అధికారులకు తన నియోజకవర్గంలో స్థానం లేదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వేలేరు ఎంపీడీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం హాజరై 46మంది లబ్ధిదారులకు రూ.46,05,336, ఇద్దరికి సీఎంఆర్​ఎఫ్​రూ.53వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పదవీ కాలం ముగుస్తున్న ఎంపీటీసీలను సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ వేలేరు మండలం చాలా ఎత్తైన ప్రాంతంలో ఉందని, మండలానికి రూ.104 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం వేలేరు మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్, కళాశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా పాఠశాలలోని తరగతి, వంట గదులను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలోని వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో కొమి, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, జడ్పీటీసీ సరిత, ఎంపీపీ సమ్మిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.