
- పదేండ్లలో సుమారు రూ.700 కోట్లు దండుకున్నరు
- రైతుల శ్రమను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- జడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో ఎమ్మెల్యే పీఎస్సార్
- పత్తి విత్తనాల బ్లాక్ మార్కెటింగ్పై రిపోర్టుకు ఆదేశం
- చివరి సమావేశంలో సమస్యలు ఏకరువు పెట్టిన సభ్యులు
మంచిర్యాల, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోళ్లలో భారీ స్కామ్జరిగిందని, తరుగు పేరుతో క్వింటాలుకు పది, పన్నెండు కిలోలు కట్చేశారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. గత పదేండ్లలో ఒక్క మంచిర్యాల నియోజకవర్గంలోనే దాదాపు రూ.700 కోట్లు దండుకున్నారని, ఈ పైసలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే దానిపై సీబీసీఐడీతో ఎంక్వయిరీ జరిపిస్తామని వెల్లడించారు.
రైతుల కష్టాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన ప్రతిపాదన మేరకు వడ్ల దోపిడీపై సీబీసీఐడీ ఎంక్వయిరీ కోరుతూ తీర్మానం చేశారు. జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు, అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్వో) శివ్ఆశిశ్ సింగ్, జడ్పీ సీఈవో గణపతి పాల్గొన్నారు.
అగ్రికల్చర్ఆఫీసర్ల చర్యలేవి?
రూ.860కు అమ్మాల్సిన పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్ చేసి రూ.1400 దాకా అమ్ముతున్నారని, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్ ముత్తె సత్తయ్య జిల్లా ఇన్చార్జి అగ్రికల్చర్ఆఫీసర్ సురేఖను ప్రశ్నించారు. స్పందించిన పీఎస్సార్ పత్తి విత్తనాలను ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించేంది లేదన్నారు. రైతులను ఎంక్వయిరీ చేసి మూడ్రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని, బాధ్యులపై క్రిమినల్కేసులు పెట్టాలని డీఏవోను ఆదేశించారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో వడ్లు దించుకోని మిల్లర్లపై యాక్షన్ తీసుకోవాలని సివిల్సప్లయిస్ డీఎం గోపాల్కు సూచించారు.
పోడు రైతులపై దాడులు చేస్తే సహించేది లేదు
ఫారెస్ట్ఆఫీసర్లు పోడు రైతులపై దాడులు చేస్తే సహించేది లేదని ఖానాపూర్ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గత ప్రభుత్వం పోడు రైతులకు తక్కువ విస్తీర్ణంలో పట్టాలు ఇచ్చిందన్నారు. పదెకరాలు ఉన్న ఓ రైతుకు మూడు నాలుగు ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చిందన్నారు. దీంతో మిగతా భూమి ఫారెస్ట్ది అంటూ పంటలు ధ్వంసం చేస్తూ, దాడులు చేస్తున్నారని ఫైర్అయ్యారు. పాత పట్టాల ప్రకారం రైతులు సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు.
లేదంటే ఆఫీసర్ల యాక్షన్ ఎట్లా ఉంటుందో ప్రజల రియాక్షన్ కూడా అదేవిధంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కవ్వాల్ ఫారెస్ట్లోని మూడు చెక్పోస్టుల్లో హెవీ వెహికల్స్కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ దందాను కంట్రోల్చేయాలని డీఎఫ్వో శివ్ ఆశిశ్ సింగ్ను కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
కవ్వాల్లో హెవీ వెహికల్స్ను అనుమతించాలి
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా జన్నారం వరకు రాత్రి వేళల్లో కూడా హెవీ వెహికల్స్ను అనుమతించాలని జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ డీఎఫ్వోను కోరారు. సాయంత్రం 5 గంటలకే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారని, దీంతో జన్నారం రావాల్సిన వాహనాలు ధర్మపురి మీదుగా తిరిగి రావడం వల్ల 50 కిలోమీటర్ల దూరాభారం పడుతోందన్నారు. జన్నారం రేంజ్లో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. లక్సెట్టిపేట నుంచి తలమల, హజీపూర్ నుంచి ర్యాలీ రోడ్లకు ఫారెస్ట్పర్మిషన్లు ఇవ్వాలని ముత్తె సత్తయ్య కోరారు. నెన్నెల మండలం కొత్తూరులో అడవి పంది దాడిలో గాయపడ్డ వ్యక్తికి ఇంతవరకు పరిహారం రాలేదని ఆ మండల ఎంపీపీ డీఎఫ్వో దృష్టికి తీసుకురాగా త్వరలోనే అందిస్తామని తెలిపారు.
గన్నీ బ్యాగుల కొనుగోళ్లలో అక్రమాలు
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గన్నీ బ్యాగుల సప్లయ్లో సివిల్సప్లయీస్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ముత్తె సత్తయ్య, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ ఆరోపించారు. ప్రతి సమావేశంలో గన్నీ బ్యాగుల లెక్కలు అడుగుతున్నా ఎందుకు చెప్పడం లేదని డీఎం గోపాల్ను నిలదీశారు. మిల్లర్లు వడ్లు అమ్ముకొని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ సీఎమ్మార్పె డుతున్నారని ఆరోపించారు.
ఏకంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే రీసైక్లింగ్ జరుగుతుంటే అధికారులు మిల్లులపై ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నించారు. కొనుగోలు సెంటర్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. వేలాది మంది గొల్లకురుమలు రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టి ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని..వాళ్లకు గొర్రెలు ఇస్తరా, డీడీ పైసలు వాపస్ ఇస్తరా చెప్పాలని జిల్లా పశువైద్యాధికారి రమేశ్ను ప్రశ్నించారు.
అడిషనల్ కలెక్టర్కు మెమోరాండం
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్తో పాటు సీహెచ్సీలు, పీహెచ్సీల్లో శానిటేషన్ అధ్వానంగా తయారైందని సభ్యులు ఆరోపించారు. మెడికల్హెల్త్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సూచించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా మండలాల్లో నెలకొన్ని సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని కోరారు. పెండింగ్ శాలరీస్ను సాంక్షన్ చేయాలని అడిషనల్ కలెక్టర్ రాహుల్కు మెమోరాండం అందించారు.