మున్సిపాలిటీగా మారనున్న మునుగోడు :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మున్సిపాలిటీగా మారనున్న మునుగోడు :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు, వెలుగు : మునుగోడు పట్టణం మున్సిపాలిటీగా మారనుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మునుగోడు మండలంలోని ఆర్టీసీ బస్టాండ్, అంగడి బజార్, పోలీస్ స్టేషన్, ఎస్సీ బాలుర వసతి గృహ భవనాన్ని ఆయన పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఓకే చోట ఉండేలా మార్పులు చేయనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని, డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలనే యోచనలో ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగానే మునుగోడును మున్సిపాలిటీగా చేయడానికి ప్రపోజల్స్​ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. 

మృతుల కుటుంబాలకు పరామర్శ.. 

నాంపల్లి మండల మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నాటి రామలింగం ఇటీవల మృతి చెందారు.  మండలంలోని తుమ్మలపల్లికి చెందిన మాజీ ఎంపీపీ దండిగ నాగమణి భర్త దండిగ వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ ఏవీ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.