
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: ప్రజాస్వామ్యంలో పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు ముందుండాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరు నియోజవర్గ పరిధిలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల పాలకవర్గాలను శుక్రవారం ఆయన సన్మానించారు.
.పటాన్చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలకు మొట్ట మొదటి సారిగా ఎన్నికై ఐదేళ్ల పాటు అభివృద్ధి పథంలో నడిపిన పాలకవర్గాలను అభినందించారు. పదవీకాలం అయిపోయిందని ఖాళీగా కూర్చోవద్దని, ప్రజల ఆశీస్సులు ఉంటే తిరిగి అవకాశం వస్తుందన్నారు.
.కొత్తగా ఏర్పడిన కాలనీలలో, మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో అందరి కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ మాజీ వైస్చైర్మన్ ప్రభాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు లలిత, పాండురంగా రెడ్డి, రోజా, మాజీ జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, బాల్రెడ్డి, మాజీ ఎంపీపీలు రవీందర్ రెడ్డి, దేవానంద్, యాదగిరి యాదవ్, దశరథ్రెడ్డి, నాయకులు శంకర్యాదవ్, విజయ్, అంజయ్య, నర్సింహ గౌడ్, సోమిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.