
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అమీన్పూర్ గోశాల పక్కన సర్వే నంబర్ 993 లోని ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే నవోదయకు 20 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 20 ఎకరాలు, మినీ స్టేడియం కోసం మరో 5 ఎకరాలను కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు వివరించారు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న అమీన్పూర్ ఏరియాలో ఇవి ఏర్పాటైతే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, మాజీ జట్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగా రెడ్డి, మాజీ వైస్చైర్మన్ నర్సింహ గౌడ్, ఆర్ఐ రఘునాథ్ రెడ్డి, గోపాల్, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.