ఉద్యమం పేరుతో కోట్లు వసూలు చేసిండు : నాయిని రాజేందర్​రెడ్డి

ఉద్యమం పేరుతో కోట్లు వసూలు చేసిండు : నాయిని రాజేందర్​రెడ్డి
  • వినయ్​భాస్కర్​పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి ఫైర్​

వరంగల్, వెలుగు: తన చేతిలో ఫోన్ ఓపెన్ చేస్తే, నిజస్వరూపం బయటపడి, పార్టీ నుంచి బహిష్కరిస్తారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​హనుమకొండ అధ్యక్షుడు దాస్యం వినయ్​భాస్కర్​పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి ఫైర్​అయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే గ్రేటర్ కాంగ్రెస్ భవన్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. గత పాలకులు, వారి అనుచరులు నియోజకవర్గంలో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేశారని ఆరోపించారు. వినయ్​భాస్కర్ ప్రపోజల్​ పేరుతో కుప్పలుతెప్పలు శిలాఫలకాలు వేసుడేకానీ, పనులు చేయకపోవడంతో ఫండ్స్ వెనక్కు పోయాయన్నారు.

తెలంగాణ ఉద్యమం పేరుతో ఆయన కోట్లాది రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు. వినయ్​భాస్కర్ కోసం వెంటనడిచిన బీసీ నేతలను అణగదొక్కడమే కాకుండా ప్రాణం తీసేలా దాడి చేయించిన ఆయన ఇప్పుడు బీసీల కోసమే మద్రాస్ స్టోరీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఎదగడానికి సొంత అన్న ప్రణయ్ భాస్కర్ పేరు వాడుకుని, ఆయన మరణాంతరం జరిగిన ఎన్నికల్లో పక్కనే ఉండి వదినకు ఓటు వేయొద్దని ప్రచారం చేశాడని ఆరోపించారు.

ఆదివారం నయీంనగర్​ బ్రిడ్జి వద్ద ఘటనలో తాము తనపై దాడి చేసినట్లు కపట నాటకాలు ఆడుతున్నాడని, అదే ఆలోచన తమకు ఉంటే ప్రెస్​మీట్ పెట్టుకోడానికి అక్కడివరకు వచ్చేవాడే కాదన్నారు. నేతలు పుల్లా పద్మావతి, అజీజ్​ఖాన్​, తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, విజయ క్ష రజాలీ, పోతుల శ్రీమాన్, మామిండ్ల రాజు పాల్గొన్నారు.