
కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇండ్లపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మూడు రోజుల పాటు తనిఖీలు చేశారని..వారికి పూర్తిగా సహకరించామని చెప్పారు. తొలి రోజే పూర్తి వివరాలను ఇచ్చామని తెలిపారు. కానీ మూడురోజులు ఏదో సాధించాలని కాలయాపన చేశారన్నారు. సోదాల తర్వాత తమకు నోటీసులు ఇచ్చి వెళ్లారని...జూన్ 20వ తేదీ మంగళవారం రోజు తమను రమ్మని నోటీసుల్లో పేర్కొన్నారన్నారు.
తనకు రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప ఏ వ్యాపారాలు లేవని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో తనిఖీలు చేశారని..బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారని చెప్పారు. తాను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారన్నారు. ఐటీ అధికారులకు తమ సీఏ పూర్తి వివరాలు ఇచ్చారని చెప్పారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారని....కానీ తమ దగ్గర ఏమీ దొరకలేదన్నారు. మీడియాలో వచ్చేవి అన్నీ అబద్దాలే అని కొట్టిపారేశారు.