- ములుగులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
ములుగు, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ములుగు జిల్లాపై ప్రత్యేక దృష్టి ఉందని, 2018లో తమ అభ్యర్థి ఓడినా ములుగు జిల్లా ఏర్పాటు చేశారన్నారు. ఎంతో మంది నిరుద్యోగులకు దారి చూపిన తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, నాయకులు పోరిక గోవింద్ నాయక్, మల్క రమేశ్ పాల్గొన్నారు.