పల్లా అక్కడ.. ఇక్కడ..!

పల్లా అక్కడ.. ఇక్కడ..!
  •     రెండు చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు
  •     మరో వివాదంలో జనగామ ఎమ్మెల్యే

జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పోచారం ఐటీ కారిడార్​లో భూ కబ్జా   కేసులో ఇరుక్కున్న ఆయన తాజాగా రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేయించుకోవడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని  ఏదో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండాలి. కానీ ఆయన  డిసెంబర్​ 27న చేర్యాలలో ఎక్స్​ అఫీషియో సభ్యుడిగా నమోదు చేయించుకున్నారు. తర్వాత  రెండు రోజులకే  డిసెంబర్​ 29న జనగామలో ఎక్స్​ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

చేర్యాల మున్సిపాల్టీలో గతనెల 19న పాలక వర్గం పై పెట్టిన అవిశ్వాసం వీగిపోవడానికి ఎమ్మెల్యే ఎక్స్​ అఫీషియో సభ్యుడిగా నమోదు కావడం  దోహదపడింది. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి కి చేర్యాల మున్సిపల్ అవిశ్వాసం సవాల్​గా మారింది. మున్సిపల్  పీఠాన్ని  కాపాడుకునేందుకు ఆయన  చేర్యాల మున్సిపాలిటీలో  డిసెంబర్​ 27న సభ్యుడిగా నమోదు చేయించుకున్నారు.   చేర్యాలలో మొత్తం 12 మంది కౌన్సిలర్లకు గాను  ఐదుగురు బీఆర్​ఎస్, ఐదుగురు కాంగ్రెస్, ​ ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు.  

ఇండిపెండెంట్ల సాయంతో అప్పుడు బీఆర్​ఎస్​ పాలకవర్గం ఏర్పాటైంది.  చైర్​పర్సన్​, వైస్​చైర్మన్​లపై బీఆర్ఎస్​కు చెందిన  నలుగురు,  ఐదుగురు కాంగ్రెస్​ కౌన్సిలర్లు  డిసెంబర్​ 21న అవిశ్వాసాన్ని ప్రకటించి సిద్ధిపేట అడిషనల్​ కలెక్టర్​కు లేటర్​ ఇచ్చారు. దీంతో జనవరి  19న అవిశ్వాసంపై  ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పల్లా సభ్యుడిగా నమోదు కావడంతో అవిశ్వాసం నెగ్గాలంటే 9మంది మీటింగ్​కు హాజరు కావాల్సిఉంటుంది. ఆయన తనతో   పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు హాజరు కాకుండా మేనేజ్​ చేశారు.

దీంతో ఏడుగురు మాత్రమే హాజరుకాగా కోరం లేదని అవిశ్వాసం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పల్లా రాజేశ్వర్​ రెడ్డి వ్యూహం ఫలించినట్టయ్యింది.    చేర్యాలలో ఎక్స్​అఫిషియో సభ్యుడిగా ఉంటూ జనగామ మున్సిపాలిటీలోనూ ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్​ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  జనగామ మున్సిపాలిటీలోనూ  ​ అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ తన  ఓటు  వినియోగించుకోవాలనే ఉద్దేశంతో  రూల్స్​కు విరుద్ధంగా ఆయన ఇక్కడ ఓటరుగా నమోదైనట్టు భావిస్తున్నారు.

జనగామలో ప్రమాణం చేశారు 

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి గత డిసెంబర్​ 29న జనగామ మున్సిపల్​ ఎక్స్​ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  ఆయన తొలిసారి జరిగిన జనరల్​ బాడీ మీటింగ్​కు వచ్చారు. అదే రోజు ప్రమాణం చేయించాను. 
- చంద్రమౌళి, మున్సిపల్​ కమిషనర్​, జనగామ