
- కొట్టుకుపోయిన తాత్కాలిక బ్రిడ్జి వద్ద రిపేర్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
- మొదలైన రాకపోకలు, దీక్ష విరమించిన ఎమ్మెల్యే
కాగజ్నగర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సోమవారం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రెండేండ్ల కింద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి మూడు పిల్లర్లు కూలడంతో రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాత్కాలిక వంతెన, రోడ్డు ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో తాత్కాలిక వంతెన సైతం కొట్టుకుపోవడంతో కాగజ్నగర్ – దహెగాం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో నిధులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే కాంట్రాక్టర్ పనులు ఆలస్యంగా చేస్తున్నాడని ఎమ్మెల్యే దీక్షలకు దిగారు. బ్రిడ్జి రిపేర్లు పూర్తైనప్పటికీ అప్రోచ్ రోడ్డు వేయకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. బ్రిడ్జిని త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్కను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచేదాకా దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ దీక్షల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, కాళీదాస్ మజుందార్ పాల్గొన్నారు.
సీఎం ఆఫీస్ వద్ద దీక్ష చేయాలి : ఆర్ఎస్.ప్రవీణ్కుమార్
కాగజ్నగర్ మండలం అందెవెల్లి పెద్దవాగు అప్రోచ్ రోడ్డు, కొట్టుకుపోయిన తాత్కాలిక బ్రిడ్జిని సోమవారం ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పరిశీలించారు. ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్బాబు సమస్యల కోసం దీక్ష చేయడం ఏమిటని ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు. ‘దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు.. హైదరాబాద్లోని సీఎం ఆఫీస్, ఆర్అండ్బీ ఆఫీసర్ల వద్ద’ అని సూచించారు.
పెద్దవాగు బ్రిడ్జి పైనుంచి రాకపోకలు స్టార్ట్
కాగజ్నగర్ మండలం అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పైనుంచి రాకపోకలు మొదలయ్యాయి. బ్రిడ్జి వద్ద తాత్కాలిక అప్రోచ్ రోడ్డు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఆర్అండ్బీ ఆఫీసర్లు సోమవారం మొరం పోయించారు. సాయంత్రం వరకు పనులు పూర్తి కావడంతో రాకపోకలు మొదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే హరీశ్బాబు దీక్ష విరమించారు.