రైతులు తలెత్తుకొని తిరగాలి : పోచారం శ్రీనివాస్ రెడ్డి

రైతులు తలెత్తుకొని తిరగాలి : పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు : రైతులు తల ఎత్తుకొని తిరగాలని, అప్పుల్లో కూరుకుపోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ మండలం బుడ్మీ సొసైటీ పరిధిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయదారులంటే అప్పుల్లో మునిగిపోయిన వారని అందరూ అనుకుంటున్నారని, ఆ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు.  

తాను వ్యవసాయం చేశానని,  అప్పట్లో ప్రభుత్వం ఇప్పటిలా సహాయం అందించేది కాదని కానీ, ఇప్పుడు సహాయం అందిస్తోందని, అంతేకాకుండా సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టాలని  రైతులకు సూచించారు. ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలలోనే అమ్మాలన్నారు.  రైతులకు ఏ ఇబ్బంది వచ్చిన తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.   కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, సొసైటీ చైర్మన్ గంగుల గంగారం, మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేశ్, మోహన్ నాయక్ తదితరులు ఉన్నారు. 

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలంలోని మెంగారం, మాలపాటి, శెట్పల్లి సంగారెడ్డి, లొంకల్​పల్లి, కన్నాపూర్, పోల్కంపేట గ్రామాలలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్​ చైర్మన్లు ప్రారంభించారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, తాలు గింజలు లేకుండా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తేవాలని లింగంపేట సొసైటీ చైర్మన్​ దేవేందర్​రెడ్డి రైతులకు సూచించారు. పోల్కంపేట, కన్నాపూర్​గ్రామాలలో ఐకేపీ డీపీఎం రమేశ్​బాబు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో లింగంపేట సొసైటీ వైస్​ చైర్మన్​మాకం రాములు, సీఈఓలు అవుసుల శ్రీనివాస్, పెంటయ్య, ఎంపీడీఓ నరేశ్​తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

లింగంపేట, వెలుగు : జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు  మౌలిక సదుపాయాలను  కల్పించాలని  పీఏసీఎస్ ల చైర్మన్లు,​సీఈఓలకు కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్​సూచించారు. గురువారం గాంధారి మండలం సీతాయిపల్లి పీఏసీఎస్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు, ధాన్యం తూకం వేయడానికి వేయింగ్​ మిషన్లు ఉంచాలన్నారు. ధాన్యాన్ని శుభ్రం చేసి తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ప్రతీరైతుకు టోకెన్​ జారీ చేయాలని చెప్పా రు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్​మిల్లుకు తరలించాలనీ, బస్తాపై సెంటర్​నంబర్, జిల్లా కోడ్​వివరాలు రాయాలన్నారు.  కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నెప్రబాకర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమలప్రసాద్, ఫౌరసరఫరాల శాఖ జిల్లామేనేజర్​ రాజేందర్, సీతాయిపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.