మెదక్ ​నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్ ​నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రోహిత్​రావు సూచించారు. మంగళవారం మెదక్​కలెక్టరేట్ లో కలెక్టర్​రాహుల్​రాజ్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఏడుపాయల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో పెండింగ్​ పనులను పూర్తి చేయాలన్నారు. చెరువుల సుందరీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరేగేషన్​ అధికారులకు సూచించారు. వేసవి కాలం దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని మిషన్​ భగీరథ అధికారులను ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్​అందించాలని విద్యుత్​శాఖ అధికారులకు సూచించారు.

మెదక్​, రామాయంపేట, మున్సిపాలిటీలలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. ప్లానింగ్​నిధుల కింద విద్యాశాఖకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని, వీటితో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. మెదక్​ పట్టణంలోని మెడికల్​కాలేజీలో అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్​రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పంచాయతీరాజ్, ఆర్​అండ్​బీ, మిషన్​భగీరథ, వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్​అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.