ఎమ్మెల్యే షకీల్ హత్యాయత్నం కేసులో ఇద్దరు మజ్లిస్​ కౌన్సిలర్ల అరెస్ట్

ఎమ్మెల్యే షకీల్ హత్యాయత్నం కేసులో ఇద్దరు మజ్లిస్​ కౌన్సిలర్ల అరెస్ట్

నిజామాబాద్​, వెలుగు:  బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ను  హతమార్చాలనే  కుట్రతో  దాడికి  ప్రయత్నించి దౌర్జన్యం చేసిన ఇద్దరు మజ్లిస్​ పార్టీ కౌన్సిలర్లు అల్తాఫ్​, నయీంను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని  ఏసీపీ కిరణ్​కుమార్​ తెలిపారు.  శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.  పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే షకీల్​ శుక్రవారం రెంజల్​ బేస్​లోని ఒక పాఠశాలకు వెళ్లిన టైంలో నిందితులైన కౌన్సిలర్లు ఆయనపై దాడికి ప్రయత్నించారన్నారు.   సీఐ ప్రేమ్​కుమార్​, స్పెషల్​ పార్టీ పోలీసులు  అడ్డుకొని వారిని స్టేషన్​కు తీసుకొచ్చారన్నారు. తనను మర్డర్​ చేసే ప్లాన్​తో వచ్చారని ఎమ్మెల్యే షకీల్​ తమకు  ఫిర్యాదు చేశాక దర్యాప్తు చేయగా నిజాలు తెలిశాయన్నారు.  

శర్ఫు అనే వ్యక్తి ఇంట్లో ఎమ్మెల్యేపై దాడికి ఇద్దరు కౌన్సిలర్లు గురువారం ప్లాన్​ చేసినట్టు తేలిందన్నారు. సమీర్​ అనే రౌడీ షీటర్​ ఆ మీటింగ్​లో ఉన్నాడన్నారు. కౌన్సిలర్​ అల్తాఫ్​పై 14 కేసులు ఇప్పటికే రిజిస్ట్రర్​ అయి ఉన్నాయని వివరించారు. ఎమ్మెల్యేను టార్గెట్​ చేస్తూ వారు వెపన్స్​ సమకూర్చుకున్నట్టు నిర్థారించామన్నారు.  వాటికి ఎక్కడి నుంచి తెచ్చారు? అందులో ఎవరెవరి ప్రమేయం ఉందనేది విచారణ చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే షకీల్​ను హత్య చేసేందుకు తమ పార్టీలోని కొందరు లీడర్లు కుట్ర చేశారని బీఆర్​ఎస్​ పట్టణ అధ్యక్షుడు రవీందర్​యాదవ్​ ఏసీపీ కిరణ్​కుమార్​కు ఫిర్యాదు చేశారు.  బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ మున్సిపల్​ చైర్​పర్సన్​ పద్మ భర్త శరత్​రెడ్డి మరో  కౌన్సిలర్​ మీర్​నజీర్​అలీ, లీడర్​ శర్ఫు ప్రమేయం కుట్రలో ఉందన్నారు. వారి నేతృత్వంలో రౌడీషీటర్లతో మీటింగ్​ నిర్వహించి ఎమ్మెల్యేపై మర్డర్​ ప్లాన్​ వేశారన్నారు.  వారిపై పీడీ యాక్టు అమలు చేయాలన్నారు. మున్సిపాల్​ ఫ్లోర్​ లీడర్​ రాధాకృష్ణ, గంగారాం, గంగాధర్​గౌడ్​ తదితరులు ఉన్నారు.