క్యాతనపల్లి ఫ్లై ఓవర్​ను 4 నెలల్లో పూర్తిచేస్తాం : వివేక్ వెంకట స్వామి 

క్యాతనపల్లి ఫ్లై ఓవర్​ను 4 నెలల్లో పూర్తిచేస్తాం : వివేక్ వెంకట స్వామి 
  • గత సర్కారు వల్లే పదేండ్లు దాటినా పనులు కాలే
  • మార్నింగ్ వాక్​లో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

కోల్ బెల్ట్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే పదేండ్లు దాటినా క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తికాలేదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు. క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఉదయం పరిశీలించారు. పనుల ఆలస్యంపై సంబంధిత కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించబోనని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు తాను పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన కాలంలో కేంద్రాన్ని ఒప్పించి బ్రిడ్జి కోసం రూ.33 కోట్లు మంజూరు చేయించిన్నట్లు చెప్పారు. బీఆర్​ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పదేండ్లు దాటినా పనులు పూర్తికాలేదని మండిపడ్డారు. గేట్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే ఎమ్మెల్యే కాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయించడంపై ఫోకస్​పెట్టినట్లు చెప్పారు. 4 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేయించనున్నట్లు హామీ ఇచ్చారు.

రోడ్డు నిర్మించాలని వినతి

అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామం నుంచి రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ వరకు రోడ్ నిర్మించాలని, క్యాతనపల్లి చెరువు కట్టపై బ్యూటిఫికేషన్ పనులు చేయించాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. అనంతరం ఎమ్మెల్యే మంచిర్యాలలోని తన నివాసంలో ట్రాన్స్ కో, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించారు.  ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ డీఈ రమేశ్, ఇంజనీర్ హరీశ్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.