చెన్నూరులో నిరాంతర విద్యుత్తు సరఫరా : వివేక్​ వెంకటస్వామి

చెన్నూరులో నిరాంతర విద్యుత్తు సరఫరా : వివేక్​ వెంకటస్వామి
  • విద్యుత్తు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లా
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • పలు అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన

కోల్​బెల్ట్/జైపూర్​/చెన్నూర్​, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలన చెన్నూరు నియోజకవర్గంలో కరెంటు అవసరాలను తీర్చలేదని, నిరంతరాయంగా విద్యుత్తు సప్లైకు కొత్తగా మరిన్ని సబ్​స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. జైపూర్ ఎంపీడీవో ఆఫీస్ ​ఆవరణలో  రూ.10 లక్షలతో కొత్త ఎంపీపీ భవనం, భీమారం మండలం నర్సింగాపూర్​లో రూ.1.60 కోట్లతో 5 కేవీఏ విద్యుత్​ సబ్​స్టేషన్​ నిర్మాణ పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్​తో కలిసి ఆయన​ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరాలో లోపాలు రాకుండా చూసేందుకు కెపాసిటీని పెంచాల్సి ఉందన్నారు.

ఇటీవల విద్యుత్తు అధికారులతో సమస్యపై రివ్యూ చేసినట్లు తెలిపారు. ట్రాన్స్​కో సీఎండీ వరుణ్​రెడ్డిని ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి సమస్య పరిష్కారం కోసం మాట్లాడినట్లు చెప్పారు. రెండేండ్లుగా విద్యుత్​వినియోగం పెరిగిందని సీఎండీ తమ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. నర్సింగాపూర్​లో సబ్​స్టేషన్​తో పాటు త్వరలో మరో 5 కేవీఏ కెపాసిటీ సబ్​ స్టేషన్​ను చెన్నూరులో ఏర్పాటు చేస్తామన్నారు.  నియోజకవర్గం పరిధిలో విద్యుత్​ సమస్య తీర్చాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఇందారంలో 33 కేవీఏ విద్యుత్​సబ్​స్టేషన్​ ఏర్పాటు చేస్తానని చెప్పారు.

హైవే రిపేర్లు పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ..

భీమారం మండలం జోడువాగుల వద్ద జాతీయ రహదారి రిపేర్ పనులను ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ కలిసి పరిశీలించారు. నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు. అనంతరం చెన్నూరు బస్టాండ్​ ఏరియాలో టీస్టాల్​ను ప్రారంభించారు. అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గడ్డం రాములు ముదిరాజ్ ​బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీస్​లో మున్సిపల్, ఫారెస్ట్​ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారిగా జైపూర్​ మండలానికి వచ్చిన గడ్డం వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. డీఆర్డీవో కిషన్, జైపూర్​ఏసీపీ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్​ లీడర్లు  తదితరులు పాల్గొన్నారు. 

బాధితులకు ఎమ్మెల్యే ఓదార్పు

చెన్నూరు హైవేపై శుక్రవారం రాత్రి బైక్ ను బొలెరో వాహనం ఢీకొనడంతో మండలంలోని దుగ్నేపల్లికి చెందిన పర్వతాలు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి ఓదెలుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అప్పటికే మున్సిపల్​ వార్డుల్లో బైక్​పై పర్యటిస్తున్న ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. దగ్గరుండి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.