
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ పట్టణంలో రూ.17 కోట్లతో అంతర్జాతీయ పూలే, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్అండ్ బీ గెస్ట్హౌస్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువతకు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 16న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ నాలెడ్జ్ సెంటర్ కోసం జీవో జారీ చేశారని చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, అందులో సెమినార్ హాల్స్, రీడింగ్ రూమ్స్, డిజిటల్ హాల్స్, క్లాస్ రూమ్లతో లక్ష పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. మెట్టుగడ్డ ప్రాంతంలోని డైట్ కాలేజీ ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, గుండా మనోహర్, శ్రీనివాస్ యాదవ్, రాజు గౌడ్, దేవేందర్ నాయక్ పాల్గొన్నారు.