
హనుమకండలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ పోలింగ్ సెంటర్ దగ్గర అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభ్యర్థుల అనుచరులను బలవంతంగా వెళ్లగొట్టారు. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే.. ఆయా జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి . ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల్లో మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లతో పాటు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో 15 జిల్లాలకు ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులను బుధవారం డిస్ట్రిబ్యూట్ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలోని రిసెప్షన్ సెంటర్కు తరలించనున్నారు.