నిజామాబాద్​ జిల్లాలో టీచర్​ ఎమ్మెల్సీ 92.0, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీకి 76 శాతమే..

నిజామాబాద్​ జిల్లాలో టీచర్​ ఎమ్మెల్సీ 92.0, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీకి 76 శాతమే..
  • కామారెడ్డి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ  93.63, 
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 78.12 శాతం పోలింగ్    
  • నిజామాబాద్​ జిల్లాలో టీచర్​ ఎమ్మెల్సీ 92.0, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీకి 76 శాతమే..

కామారెడ్డి/ నిజామాబాద్,  వెలుగు : కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. టీచర్లు ఉదయం నుంచే ఆసక్తి చూపగా, గ్రాడ్యుయేట్​ ఓటింగ్  మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఊపందుకున్నది.  కామారెడ్డి జిల్లాలో టీచర్​ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 2,011కు గాను 1883 ఓట్లు పోలయ్యాయి. 128 మంది ఓటు వేయలేదు.  ఓటింగ్ 93.63 శాతం నమోదైంది. 

గ్రాడ్యుయేట్ ఓటర్లు  16,410  మంది ఉండగా,  12,820 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.  3,590 మంది గైర్హాజరయ్యారు. పోలింగ్​ శాతం  78.12 శాతం నమోదైంది.  భిక్కనూరులో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఏఎస్పీ చైతన్యారెడ్డి రావడంతో గొడవ సద్దుమణిగింది. బాన్సువాడలో  అగ్రో చైర్మన్ బాల్​రాజు,  బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.   

పోలింగ్​ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

జిల్లాలోని ఆయా పోలింగ్​ కేంద్రాలను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్లు విక్టర్​,  శ్రీనివాస్​రెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి పరిశీలించారు.  జిల్లా కేంద్రంలోని పోలింగ్​ కేంద్రాలతో పాటు దోమకొండ పోలింగ్  కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.  అనంతరం కలెక్టరేట్​ నుంచి వెబ్​ క్యాస్టింగ్​ ద్వారా  పోలింగ్​ సరళిని పరిశీలించారు.   కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు జిల్లా కేంద్రంలోని హైస్కూల్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పిట్లంలో ,  మాజీ విప్ గంప గోవర్దన్ కామారెడ్డిలో,  ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్​ లింగంపేటలో ఓటు వేశారు.   ఆయా పార్టీల  ప్రజాప్రతినిధులు, నాయకులు మండలాల్లోని పోలింగ్​ కేంద్రాల వద్ద వేచి చూడి పోలింగ్ సరళిని పరిశీలించారు.  

నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 31,574 గ్రాడ్యుయేట్​ ఓటర్లకుగాను  24,242 మంది ఓటు వేశారు. గ్రాడ్యుయేట్​ఓటింగ్​ 76.78 శాతం నమోదైంది.  టీచర్​ ఓటర్లు 3,751 ఉండగా, 3,468 మంది ఓటు వేశారు.  92.46 శాతం పోలింగ్​ నమోదైంది. సాయంత్రం 4 గంటల్లోపు సెంటర్లలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కలెక్టర్ రాజీవ్​ గాంధీ హనుమంతు సుభాష్​నగర్​లోని ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్​ స్కూల్​ సెంటర్​లో ఓటు వేయగా, రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి కూడా అక్కడే ఓటు వేశారు. వెబ్​ క్యాస్టింగ్​ ద్వారా కలెక్టర్​ రాజీవ్​గాంధీ ఓటింగ్ సరళిని ​ పర్యవేక్షించారు.  బోధన్​ డివిజన్​లో సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో,  నిజామాబాద్​, ఆర్మూర్​ డివిజన్​లో ఆర్డీవోలు రాజేంద్రకుమార్​, రాజాగౌడ్​ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ ముగిశాక డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లకు చేరిన బ్యాలెట్​ బాక్స్​లను కట్టుదిట్టమైన భద్రత మధ్య వాహనాల్లో రాత్రి 8 గంటలకు కరీంనగర్​లోని కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.  

పెర్కిట్ లో లైటింగ్ సమస్య..

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ హైస్కూల్ పోలింగ్ సెంటర్ 143, 45 లో లైటింగ్​ ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.  నీడ కోసం టెంట్లు వేయకపోవడంతో ఓటర్లు ఎండలో కూర్చున్నారు. వీల్ చైర్ పెట్టలేదు. నిజామాబాద్​ సౌత్​ తహసీల్దార్​ ఆఫీస్ మూసివేయడంతో ఓటర్​ స్లిప్స్​ కోసం ఓటర్లు ఇబ్బంది పడ్డారు.  ​ఓటింగ్ పరిశీలిస్తూ ముబారక్​నగర్​ పోలింగ్​ సెంటర్​కు కాషాయ కండువాతో వెళ్లిన బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​కులాచారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.