కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారింది: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారింది: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శన్నారు. జనవరి 26వ తేదీ శుక్రవారం రాత్రి సమయంలో సికింద్రాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన  ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరిని విద్యార్థినులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై జనవరి 27వ తేదీ శనివారం ఉదయం  విద్యార్థులు ఆందోళన చేపట్టారు.  దీనిపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు.

మొన్న ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నాయని వార్తలు వచ్చినా.. ప్రభుత్వం మేల్కోలేదని ఆమె మండిపడ్డారు.  ఫలితంగా ఆగంతకులు రెచ్చిపోయి నిన్న సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారు...  అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు..వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నానని డీజీపీకి ట్యాగ్ చేశారు.