
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. దీనిపై నోటీసులిచ్చినా వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పని పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు
ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 12 లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో తెలిపింది. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఇవాళ మార్చి 1న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్