
జనగామ, వెలుగు : దేశాన్ని గతంలో బ్రిటీష్ వాళ్లు దోచుకుంటే ఇప్పుడు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దోచుకుంటున్నారని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. జనగామలోని తన క్యాంపు ఆఫీస్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఆదుకోవాల్సిన సర్కార్ కొర్రీలతో మరిన్ని కష్టాలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 4.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 2022 నాటికి 3 లక్షల మందే ఉన్నారని, రిటైర్డ్ అయిన పోస్టులను తిరిగి భర్తీ చేయడం లేదన్నారు. పేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్సే అన్నారు. యూత్ డిక్లరేషన్పై అవగాహన పెంచేందుకు 16 నుంచి 35 ఏండ్ల మధ్య గల యువతకు ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్పల్లి లింగాజీ, నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, బడికె ఇందిర, కల్యాణి, మాజిద్, చందనారెడ్డి పాల్గొన్నారు.