
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యాలో పర్యటించే అవకాశం ఉంది. ‘గ్రేట్ పేట్రియాటిక్ వార్’ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగే పరేడ్కు మోదీ హాజరయ్యే అవకాశం ఉందని రష్యన్ వార్తా సంస్థ టాస్ బుధవారం వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు గత ఏడాది అక్టోబర్లో మోదీ ఆ దేశంలో పర్యటించారు. రష్యా అధ్యక్షతన కజాన్లో జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరయ్యారు.
మళ్లీ మే 9న మాస్కోలో జరిగే పరేడ్కు మోదీ వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాకుండా, ఈ పరేడ్లో భారత ఆర్మీ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పరేడ్ కు వివిధ దేశాధినేతలను ఆహ్వానించినట్టు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపే దిశగా అమెరికా, రష్యా అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నెల ప్రారంభంలో రియాద్లో మొదటి రౌండ్ చర్చలు జరిగాయి.