
మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడంతోపాటు కీలకపాత్ర పోషించాడు. ‘లూసిఫర్’కు సీక్వెల్ రాబోతున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో శనివారం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ‘పృథ్విరాజ్ ఈ చిత్రంలో తెరపై అద్భుతం చేశారు.
మేం ముందుగా లూసిఫర్ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం. ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్తో మళ్లీ వస్తాం. పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని రకాల అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. అథెంటిక్గా ఉండాలని ప్రయత్నించాం.
తెలుగు వెర్షన్లో చూస్తే ఒరిజినల్ సినిమానే అనుకుంటారు. ‘లూసిఫర్’ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ అన్ని చోట్లా మంచి రీచ్ వచ్చింది. అందుకే ఇప్పుడు రెండో పార్ట్ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా సర్ప్రైజ్ అవుతున్నాం’ అని అన్నాడు. అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని దిల్ రాజు అన్నారు. కార్తికేయ, కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ పాల్గొన్నారు.