
శనకపురి రాజ్యాన్ని చంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. చంద్రవర్మ ఒకసారి వేటకు వెళ్ళాడు. అడవిలో దారి తప్పి ప్రయాణిస్తున్న రథం బోల్తాపడడంతో బాగా గాయాలవ్వడమే కాకుండా కళ్లు పూర్తిగా పోయాయి. మహారాజు చంద్రవర్మ గుడ్డివాడైనాడని తెలిసి ప్రజలంతా బాధపడ్డారు. అయినా చంద్రవర్మ ప్రజలు బాగుండాలని సోదరుడు విజయవర్మకు రాజ్యభారం అప్పగించాలని నిర్ణయిస్తాడు.
కానీ మహామంత్రి అనంతుడు ప్రస్తుతం ఆరు మాసాల వరకు మంచి రోజులు లేవనగా, మహారాజు చంద్రవర్మ మహామంత్రి మాటను కాదనలేక తాను రాజమందిరంలోనే ఉండి, ప్రజా సంక్షేమ భారాన్ని సోదరుడు విజయవర్మకు అప్పగించాడు. ప్రతిరోజు విజయవర్మ రాజమందిరానికి వచ్చి చంద్రవర్మ సూచనల ప్రకారం ప్రజా సంక్షేమమై సాగుతున్నాడు. కాలం వేగంగా సాగిపోయింది. ఆరు మాసాల సమయం పూర్తయింది. మహామంత్రి అనంతుడు ఓ సుమూర్తం నిర్ణయించగా చంద్రవర్మ సోదరుడు విజయవర్మకు రాజ్యపట్టాభిషేకం చేయదలిచాడు.
ప్రజలు, సామంతులు అందరూ కూడా పట్టాభిషేక ప్రాంతానికి చేరుకున్నారు. గుడ్డివాడైన చంద్రవర్మను చూసి ప్రజలంతా దుఃఖించసాగారు. జయజయధ్వానాల మధ్య పట్టాభిషేక కార్యక్రమం సాగుతుంది. ప్రజలందరూ పండించిన బియ్యాన్ని అక్షింతలుగా తెచ్చుకొని పట్టాభిషేక సుమూహూర్తాన రాజుపై చల్లుతారు.
ఆ అక్షింతల్లో కొన్నింటిని చంద్రవర్మకు అందజేస్తారు. చంద్రవర్మ అక్షింతలకు నమస్కరించి అలాగే సింహాసనంలో కూలబడి, మహామంత్రి అనంతుడి చెవిలో ఏదో గుసగుసలాడతాడు. ప్రజలంతా అయోమయపడుతుండగా మహామంత్రి అనంతుడు చిరునవ్వు నవ్వుతూ విజయవర్మను బంధించి చెరసాలలో వేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రజలంతా ఆనందంతో హర్షధ్వనులతో మహారాజు చంద్రవర్మకు జేజేలు పలుకుతారు.
చంద్రవర్మ ప్రజలందరికీ అభివందనం చేసి ఇకపై కూడా మహారాజుగా నేనే ఉంటాను. పాలనా భారం మహామంత్రి అనంతుడు చూస్తాడంటూ ముహూర్తానికి ఆరు మాసాల గడువు పొడిగించడం మూలంగా మీరిచ్చిన అక్షింతల ద్వారా విజయవర్మ పాలన సరిగా లేదని తెలిసింది. మట్టి వాసనతో పులకించే అక్షింతలు పంట నుంచి వస్తాయి. ఈరోజు మీరు అందించినవి ముక్కిన అక్షింతలు కనుక విజయవర్మ అసలు రూపం తెలుసుకున్నానని అనగానే ప్రజలందరూ సంతోషంగా తమ నివాసానికి వెళ్తారు.
సామంతులు గుడ్డివాడైనా చంద్రవర్మ ప్రజలపై తనకున్న ప్రేమను చూపడంతో సంతోషంగా తమ ఇళ్లకు వెళ్తారు. అప్పటినుంచి చంద్రవర్మ తనకు మాత్రమే గుడ్డితనమని ఇతరుల సహాయంతో రాజ్య సమస్యలను వీక్షిస్తూ, అనంతుడి ద్వారా ప్రజాసంక్షేమానికి పాటుపడసాగాడు.
- ఉండ్రాళ్ళ రాజేశం –