
- ఐఐఆర్ఆర్, అగ్రికల్చర్ వర్సిటీ మధ్య అగ్రిమెంట్
హైదరాబాద్, వెలుగు: వరి వంగడాల కోసం మరిన్ని పరిశోధనలు జరపాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వరి సాగుపై ప్రధానంగా అతివృష్టి, అనావృష్టి తీవ్ర ప్రభావం చూపుతున్నందున అన్నిరకాల వాతావరణ పరిస్థితులు తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలు రూపొందించాలని ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్ లోని వర్సిటీ అడ్మిన్ బిల్డింగ్లో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, ఇండియన్ఇనిస్టిట్యూట్అఫ్ రైస్ రిసెర్చ్(ఐఐఆర్ఆర్) డైరెక్టర్ డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం, అగ్రివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో ఎంఓయూ పేపర్స్పై సంతకాలు జరిగాయి.
వరిలో ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనాలు కలిగించేలా ఈ రెండు సంస్థలు కలిసి కృషి చేయనున్నాయి. వరిలో కార్బన్ క్రెడిట్ ద్వారా రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం కలిగించే విధానాలపై దృష్టిపెట్టబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మన అవసరాలు పోగా ఏటా 50 లక్షల టన్నుల వరి ధాన్యం అదనంగా ఉత్పత్తి అవుతోంది. ఈ మిగులు ధాన్యాన్ని వివిధ రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న సాంకేతికపరమైన అడ్డంకులను తొలగించేందుకు ఈ రెండు సంస్థలు కృషిచేయనున్నాయి.