ఓ మై గాడ్.. ఒక్కరోజే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

ఓ మై గాడ్.. ఒక్కరోజే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ: భారత్లో విమానాలకు బాంబు బెదిరింపుల బెడద వీడటం లేదు. ఇవాళ ఒక్కరోజే (అక్టోబర్ 19, 2024) 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలియన్స్ ఎయిర్ విమానాలకు బాంబు బెదిరింపులొచ్చినట్లు తెలిసింది.

ఏఏ విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయంటే.. ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళుతున్న ఇండిగో ఫ్లైట్స్కు (6E 11, 6E 17), జోధ్పూర్ నుంచి ఢిల్లీ (Flight 6E 184) వెళుతున్న ఇండిగో విమానానికి, ఉదయ్పూర్ నుంచి ముంబై వెళ్లాల్సిన విస్తారా ఫ్లైట్కు (Flight UK 624 ) బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. 

విమానాలకు టార్గెట్ చేస్తూ.. బెదిరింపు కాల్స్, మెయిల్స్ చేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షిస్తామని.. మిగతా వారిని సైతం వెంటనే గుర్తించి అరెస్ట్ చేస్తామని.. ఎవరూ ఎలాంటి భయాందోళనలు చెందొద్దు అని విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహననాయుడు ప్రకటించారు. అయినప్పటికీ బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. 

ఫేక్ కాల్స్ అని లైట్ తీసుకుంటే.. ఆ తర్వాత అది నిజం అయితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన ఆయా విమాన సంస్థల నిర్వాహకుల్లో నెలకొంది. విమాన సర్వీసుల భద్రతపై రాజీలేదని.. సెక్యూరిటీ కట్టుదిట్టం చేశామని.. విమానం బయలుదేరే ముందే అన్ని రకాలుగా చెకింగ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు వెల్లడించారు. 

బెదిరింపు కాల్స్, భద్రత విషయాలపై 2024, అక్టోబర్ 17వ తేదీన ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోంశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫేక్ కాల్స్ చేసే వాళ్లను విమానం ఎక్కేందుకు శాశ్వతంగా నిషేధించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచన చేశారు.