లింక్​లు, మెసేజ్​లు క్లిక్​ చేస్తే అకౌంట్ ఖాళీ​ .. సైబర్​ నేరగాళ్ల కొత్త దారులు

లింక్​లు, మెసేజ్​లు క్లిక్​ చేస్తే అకౌంట్ ఖాళీ​ .. సైబర్​ నేరగాళ్ల కొత్త దారులు
  • 5 నిమిషాల్లో లోన్​, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ మోసం
  • యాదాద్రి జిల్లాలో  ఈ ఏడాది 25కు పైగా కేసులు
  • ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు

యాదాద్రి, వెలుగు : సైబర్​ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు.  5 నిమిషాల్లో లోన్​, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ మెసేజ్​లు, లింక్​లు పంపుతున్నారు.  దరఖాస్తు  చేయకున్నా లోన్​ శాంక్షన్​ అయిందని ఇంకొన్ని మెసేజ్​లు వస్తున్నాయి.  వాటికి ఆకర్షితులై, సమాధానం ఇచ్చినా.. లింక్​లను క్లిక్​ చేసినా.. బ్యాంక్​ అకౌంట్​ ఖాళీ చేసేస్తున్నారు. 

తక్కువ రేటుకే ఆవులు ఇస్తామని..

యాదాద్రి జిల్లాలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతుకు తక్కువ రేటుకే ఆవులు ఇస్తామని వాట్సాప్​లో మెసేజ్​తోపాటు ఫొటోలు వచ్చాయి. పంపిన ఫొటోల్లోని మూడు ఆవులను సెలెక్ట్  చేసుకోవాలని, రూ.1.05 లక్షలు పంపించాలని సూచించారు. దీంతో, ఆవులను సెలెక్ట్​ చేసుకొన్న సదరు రైతు రూ.85,300 ఫోన్​ పే ద్వారా పంపించాడు. మిగిలిన సొమ్ము ఇస్తేనే జీవాలను సరఫరా చేస్తామని అవతలి వ్యక్తి చెప్పడంతో మోసపోయామని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నాయి. 

లోన్​ శాంక్షన్​ అయిందని..

ఇటీవల సైబర్​ నేరగాళ్లు.. లోన్​ శాంక్షన్​ అయిందని చెబుతూ మెసేజ్​లు పంపిస్తున్నారు. ఎలాంటి గ్యారెంటీలు, పేపర్లు అవసరం లేదంటూ లింక్​లు కూడా పెడుతున్నారు. రూ.లక్షల్లో లోన్​ ఇస్తామని, ఐదు స్టెప్పుల్లోనే అకౌంట్లలో డబ్బు వేస్తామంటూ ఇంకొందరు లింక్​లు పంపిస్తున్నారు. అప్పు ఇస్తామంటూ వాయిస్​ కాల్స్​ చేస్తున్నారు. ఆ కాల్స్, మెసేజ్​లు, లింక్​లకు స్పందిస్తే అకౌంట్​ నంబర్లు, ఓటీపీలు కావాలంటారు.  పంపించాక బ్యాంక్​అకౌంట్లలోని డబ్బులు ఖాళీ చేస్తున్నారు.

జాబ్ ఇస్తామని..

జాబ్ ఇస్తామని.. అది కూడా ఇంట్లో కూర్చొని, చేయొచ్చంటూ వాట్సాప్ మెసేజ్​లు పంపిస్తున్నారు. రోజుకు రూ.1,500 నుంచి రూ.8 వేల వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు.  డబ్బులు సంపాదిస్తున్న కొందరి పేమెంట్ వివరాలకు సంబంధించిన స్క్రీన్ షాట్ పంపిస్తున్నారు.  ఇలాంటి మెసేజ్​చూసిన భువనగిరి మండలం బండ సోమారం గ్రామానికి చెందిన వ్యక్తి క్లిక్ చేయడంతో అతడి బ్యాంక్​ అకౌంట్ నుంచి రూ.40 వేలు  కాజేశారు. 

సెర్చ్​ చేసిన వారిని..

తమ అవసరాల కోసం కొందరు వ్యక్తులు ఆన్​లైన్​లో అప్పు కోసం యాప్స్​ను వెతుకుతున్నారు. దీంతో సైబర్​ నేరగాళ్లు వారిని సులభంగా ఉచ్చులోకి దింపుతున్నారు. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి, అడగ్గానే కొంతమంది తమ బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, ఓటీపీలు చెప్పేస్తున్నారు. తర్వాత అకౌంట్​లోని డబ్బును సైబర్​ నేరగాళ్లు కాజేస్తున్నారు.  కొందరు లోన్​ కోసం సెర్చ్​ చేసిన వారికి ఇవ్వకుండానే.. ఇచ్చినట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

ఇటీవల ఓ వ్యక్తి లోన్​ కోసం ట్రై చేసి, వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడికి లోన్​ ఇవ్వకపోగా.. అకౌంట్​లోని డబ్బును ఖాళీ చేశారు.  పైగా తాము రూ. 50 వేలు లోన్​ ఇచ్చామంటూ చెల్లించడానికి ఈఎంఐ తేదీలతో  వాట్సాప్​ మెసేజ్​లు పంపించడంతోపాటు కాల్స్​ కూడా చేశారు. లోన్​ కట్టకుంటే నీ న్యూడ్​ ఫొటోలు అందరికీ షేర్​ చేస్తామంటూ.. కొన్ని ఫొటోలను పంపించారు. వాటిని చూసి, బెదిరిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి, తన గోడు వెల్లబోసుకున్నాడు. మరో వ్యక్తి తన ఫ్రెండ్​కు ఫోన్​ పే ద్వారా పంపించిన అమౌంట్​ చేరకపోవడంతో ఫేక్​ కస్టమర్​ కేర్​ను ఆశ్రయించి, రూ.40 వేలు పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెరుగుతున్న కేసులు..

గతంతో పోలిస్తే యాదాద్రి జిల్లాలో సైబర్​ నేరాలు పెరుగుతున్నాయి. 2021లో జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2022 నుంచి 2024 వరకు 197 కేసులు నమోదవగా, రూ.1.40 కోట్లకు పైగా బాధితులు కోల్పోయారు.  అయితే, సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బు కోల్పోయినా.. పరువు పోతుందనే ఉద్దేశంతో కొందరు పోలీస్​ స్టేషన్​ మెట్లు ఎక్కడం లేదు. మరికొందరేమో తమ పేర్లు బయటకు వెల్లడించవద్దని పోలీసులను కోరుతున్నారు. సైబర్​ మోసాలపై పోలీస్​ శాఖ హెచ్చరిస్తున్నా పెద్దగా ఫలితం లేదు. అకౌంట్ నుంచి డబ్బులు కోల్పోయిన వెంటనే 1930 నంబర్​కు ఫోన్​ చేయాలని బాధితులకు పోలీసులు సూచిస్తున్నారు. 

సంవత్సరాల వారీగా కేసుల వివరాలు

2022          13
2023          52
2024       132
2025          25కు పైనే            (ఇప్పటివరకు)