
- కొత్తగా భూ భారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు
- త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే చాన్స్
హైదరాబాద్, వెలుగు: భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. భూ భారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో మాన్యువల్గా దరఖాస్తులు ఇవ్వొచ్చని చెప్తున్నారు.
దీంతో కొంతమంది భూ భారతిలో అప్లికేషన్లు పెట్టుకుంటుండగా.. మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో 81 వేలపైనే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో పాస్ బుక్ డేటా కరెక్షన్ కింద అంటే టీఎం 33 మాడ్యుల్ కింద వచ్చినవే ఎక్కువ ఉన్నాయి. భూ భారతి ప్రారంభించడంతో ధరణిలో ఉన్న పెండింగ్ అప్లికేషన్లన్నింటినీ భూ భారతి పోర్టల్కు బదిలీ చేశారు.
తిరస్కరించినవే ఎక్కువ!
భూ భారతి చట్టం తీసుకురావడమే కాకుండా ఇందులో తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ స్థాయిలలో అధికారాలను వికేంద్రీకరించారు. దీంతో చిన్నాచితకా సమస్యలన్నీ తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందులో భాగంగానే ధరణి నుంచి వచ్చిన పెండింగ్ అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. అధికారులు మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండానే, కారణాలు చెప్పుకుండానే పాత అప్లికేషన్లను ఒక్కొక్కటిగా తిరస్కరిస్తున్నారు.
కొన్నిచోట్ల కనీసం రిపోర్ట్లు కూడా పెట్టకుండానే రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో తహసీల్దార్ల స్థాయిలో ఉన్న 37 వేల పెండింగ్ అప్లికేషన్లు ఒకేసారి 20 వేలకు తగ్గిపోయాయి. ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల లెవల్లో పెండింగ్లో ఉన్న మిగతా 40 వేల అప్లికేషన్లలో దాదాపు సగానికి పైగా క్లియర్ చేసినట్లు పైకి నివేదించారు. వీటిలో పరిష్కారమైనవి అరకొర కాగా, తిరస్కరించినవే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.
కొత్తవాటికి భూభారతి రూల్స్ ప్రకారమే క్లియరెన్స్
ధరణిలో అప్లికేషన్లు రిజెక్ట్ కావడం, కొత్తగా భూ భారతి చట్టం రావడంతో గతంలో పరిష్కారం కాని తమ సమస్యలు ఈసారైనా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో చాలామంది రైతులు ఆయా మాడ్యుళ్ల కింద అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. భూ భారతిలో ప్రతి అప్లికేషన్కు కొంత నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూ భారతి పోర్టల్లో కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తును కూడా భూ భారతి చట్టం రూల్స్ ప్రకారమే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా అందుకు సరైన కారణం చెప్పాల్సిందే.
పైగా నిర్దేశించిన సమయంలో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ఇబ్బంది ఉంటే రెవెన్యూ సదస్సులు నిర్వహించే వరకు ఆగాలని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ, మాన్యువల్గా తీసుకునే దరఖాస్తులకు అంత ప్రియారిటీ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.