
సంగారెడ్డి, వెలుగు : మెదక్లో అదృశ్యమైన తల్లీకూతుళ్లు సంగారెడ్డిలోని చెరువులో శవాలై కనిపించారు. స్థానిక వినాయక సాగర్ చెరువులో బుధవారం గుర్రపుడెక్క తొలగిస్తుండగా ఇద్దరు మహిళల డెడ్బాడీలు దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి టౌన్ సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ పట్టణఆనికి చెందిన విజయలక్ష్మి (54), ఆమె కూతురు మణిదీపిక (27) ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో విజయలక్ష్మి భర్త సత్య మెదక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు అయింది.
ఇదిలా ఉండగా సంగారెడ్డిలోని వినాయక సాగర్ చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో కొందరు వ్యక్తులు చెరువులోకి దిగి తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల డెడ్బాడీలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించి, ఆధార్కార్డు ఆధారంగా విజయలక్ష్మి, మణిదీపికగా గుర్తించారు. ఇద్దరి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ మొదలు పెట్టారు.