శామీర్ పేట, వెలుగు: ఐరన్ షీట్పై తన కొడుకు చెప్పు పడిందని మరో మహిళ సహాయంతో ఐరన్ రాడ్ తో తీసే ప్రయత్నంలో విద్యుత్ తీగలకు తగిలి తల్లి మృతి చెందగా.. మరో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. శామీర్ పేట తూంకుంట మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి 12ఏళ్ల క్రితం గొల్ల రాజు, శీరిష (27) దంపతులు మేడ్చల్ జిల్లా తూంకుంటకు వచ్చి కొడుకు, కూతురు తో ఉంటున్నారు. ఆమె కొడుకు చెప్పు ఇంటి ముందు ఉన్న షెడ్ పై పడింది. పక్కింటి మహిళ ప్రసన్న సాయంతో తీసేందుకు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరూ కిందపడ్డారు.
ఆ ఇంటి యజమాని మన్నె సురేశ్ యాదవ్ ప్రసన్నకు సీపీఆర్ చేసి బతికించారు. శిరీషను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శామీర్ పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.