రాజకీయ నాయకులు ప్రజల దృష్టి ఆకర్షించడానికి ‘మా’ పేర్లు వాడకండి : మా అసోసియేషన్

రాజకీయ నాయకులు ప్రజల దృష్టి ఆకర్షించడానికి ‘మా’ పేర్లు వాడకండి : మా అసోసియేషన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినీ నటుడు నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి చేసిన ఆరోపణలపై సినీ ప్రముఖులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా, ఈ ఆరోపణలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) నుండి అధికారిక ప్రకటన విడుదల చేశాడు. 

"సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలవలె, పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుందని మా అధ్యక్షుడు మంచి విష్ణు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఆదర్శంగా ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం మరియు రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్ట పడరని.. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం అని విష్ణు తెలిపారు. 

Also Read :- మంత్రి కొండా సురేఖ V/s సినీ ఇండస్ట్రీ

రాజకీయ నాయకులు, మరియు ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 'దయచేసి రాజకీయ కధనాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు మరియు వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము, చిత్రపరిశ్రమలో పనిచేసేవారు, సమాజానికి వినోదం ఇవ్వడానికి మరియు సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకూడదు అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని' నోట్ ద్వారా విష్ణు చెప్పుకొచ్చాడు. 

పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతామని మా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించాడు.