నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రైవేటు స్థలమా ? : ఎంపీ అర్వింద్

నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రైవేటు స్థలమా ? : ఎంపీ అర్వింద్

నిజామాబాద్, వెలుగు : నవోదయ పాఠశాల ఏర్పాటుకు బోధన్​ పట్టణ శివారులోని నిజాంషుగర్​కు సంబంధించిన ప్రైవేటు స్థలాన్ని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఎలా ప్రతిపాదిస్తారని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సెగ్మెంట్​కు కోరుట్ల, జక్రాన్​పల్లి మండలం కలిగోట్​లో ఏర్పాటు చేసేందుకు రెండు నవోదయ స్కూళ్లను మంజూరు చేయించానన్నారు.తమ పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి తన సెగ్మెంట్లో పెట్టాలని ఒత్తిడి చేసినా ప్రజల సౌకర్యం దృష్ట్యా నిర్ణయం మార్చుకోలేదన్నారు. ఒక్కో చోట రూ.వంద కోట్లతో  నిర్మించే నవోదయ ఏర్పాటు విషయంలో అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడానన్నారు.

కలెక్టర్​గా పనిచేసిన అనుభవంతో ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్టేట్​ ఎడ్యుకేషన్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా తాను ప్రతిపాదించిన కలిగోల్ గ్రామాన్ని నవోదయకు ఓకే చేశారన్నారు. లిక్కర్​ బిజినెస్​ చేసే సుదర్శన్​రెడ్డి సొంత ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నారని ఎంపీ ఆరోపించారు.  కలిగోట్​ నుంచి నవోదయ వెళ్తుంటే రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎందుకు సైలెంట్​ అవుతున్నారని ప్రశ్నించారు.

జక్రాన్​పల్లిలో ఎయిర్​ పోర్టు నిర్మాణం ముందుకు పడాలంటే స్టేట్​ గవర్నమెంట్​ సర్వే రిపోర్టు అవసరమని తెలిసి కూడా భూపతిరెడ్డి కదలడంలేదన్నరు. రెండు ఎమ్మెల్సీలు ఓడినా కాంగ్రెస్​కు బుద్ధి రావడంలేదన్నారు. నిజామాబాద్​ జిల్లా నుంచి 85 శాతం ఓట్లు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పడ్డాయన్నారు. నగర పాలక ఎలక్షన్​ ఎప్పుడు జరిగినా పోటీ మజ్లిస్​, బీజేపీ మధ్యే ఉంటుందన్నారు.

ఆదివారం ఎంపీలతో మీటింగ్​ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఒక రోజు గడువుతో సమాచారం పంపి రమ్మనడం విచిత్రంగా ఉందన్నారు. జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే తప్పేముందన్నారు. సమావేశంలో ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​​, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు.