
జనగామ, వెలుగు : భువనగిరి పార్లమెంట్పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రైన్ల హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి శనివారం కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రం అందించారు. కేంద్ర మంత్రి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయనను మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్ రెడ్డి, కడియం కావ్యలు కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కిరణ్కుమార్ రెడ్డి పార్లమెంట్పరిధిలోని స్టేషన్లలో ట్రైన్ల హాల్టింగ్ లు సరిగా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై వినతి పత్రం అందించారు.
భువనగిరిలో పద్మావతి ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కల్పించాలన్నారు. మచిలీపట్నం ట్రైన్ కూడా ఆగడం లేదన్నారు. కాకతీయ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య నడిచేదని, దీని సమయం మార్చి ఉదయం 4 గంటలకే వస్తోందన్నారు. యథావిధిగా గతంలోని టైంకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్–వరంగల్ రూట్లో నాలుగు సార్లు నడిచే పుష్పుల్ ట్రైన్ కూడా ఉదయం, సాయంత్రం మాత్రమే నడుస్తోందని, నాలుగు సార్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.