
నిజామాబాద్: సౌత్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గుతాయనేది కేవలం రీజినల్ పార్టీల తప్పుడు ప్రచారమని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం (మార్చి 8) నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల సమిష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఆల్ పార్టీల ఎంపీల సమావేశంలోనూ కాంగ్రెస్ రాజకీయం చేసిందని.. తమకు ప్రోటోకాల్ మేరకు ఆహ్వానం అందలేదని తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవమని తెలిసి కూడా అదే రోజు సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు షెడ్యూల్ వల్లే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్కు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్కు దళితులపై ప్రేమ ఉంటే సీఎం కుర్చీ ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలతో బీసీ రిజర్వేషన్ చట్టం ఎలా చేస్తారని ప్రశ్నించారు.
నిజామాబాద్లో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అడ్డుపుల్ల వేస్తున్నారని.. నవోదయ నిజామాబాద్ రూరల్లో వద్దని.. బోధన్లోని నిజాం సుగర్స్ భూమిలో ఏర్పాటు చేయాలనడం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతగాని దద్దమ్మలు అని.. వాళ్ల పని కూడా నేనే చేయాల్సి వస్తోందని ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.