
పాలమూరు, వెలుగు: మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులను వెంటనే పూర్తి చేయాలని రైల్వే అధికారులకు ఎంపీ డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. బుధవారం క్యాంపు క్యారాలయంలో రైల్వే శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని మహబూబ్ నగర్ దేవరకద్రలో ఆర్ఓబీ, డబ్లింగ్ పనుల కోసం భూసేకరణ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు, పట్టణంలో రైల్వే డబ్లింగ్ భూసేకరణ పనులు పూర్తి చేసి రైల్వే గేట్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
పట్టణంలోని తిమ్మసానిపల్లి బొక్కలోనిపల్లి ప్రాంతాల్లో రైల్వే గేట్ పడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ పనులను పూర్తి చేసి పరిష్కరిస్తామని రైల్వే అధికారులు ఎంపీకి వివరించారు. కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు సంజయ్ కుమార్, జగదీశ్, రాజు, ఆర్డిఓ నవీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ దిలీప్ కుమార్, జైపాల్ రెడ్డి శివానంద్, సర్వేయర్ రాఘవేందర్, రైల్వే అధికారులు ఇంజనీర్లు పాల్గొన్నారు.