
రామచంద్రాపురం, వెలుగు: మెదక్ జిల్లాకు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం ఉదయం రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్ఈఎల్ గ్రౌండ్ వద్ద మార్నింగ్ వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, స్థానిక యువకులతో కలిసి వాకింగ్ చేస్తూ మాట్లాడారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్లాంటి సంస్థలను దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తీసుకొచ్చినవే అన్నారు.
నేడు కొన్ని లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు వీటిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు, అన్ని వర్గాలకు సముచిత స్థానాలు దక్కాలంటే కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని అందుకే యువత ఆలోచించి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. తాను ఎంపీగా గెలిస్తే ఇండోర్ ప్లే గ్రౌండ్స్, వాకింగ్ ట్రాక్స్ , ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం బీహెచ్ఈఎల్లోని ఐఎన్టీయూసీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్మికుల పక్షాన నిలబడే కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ప్రమాణం చేశారు. ఐన్టీయూసీ అధ్యక్షుడు రెహ్మాన్, దామోదర్ రెడ్డి, కొండారెడ్డి, స్వామి, వలియుద్దీన్, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కార్మిక లోకానికి అండగా కాంగ్రెస్
కార్మిక లోకానికి కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా నిలస్తుందని నీలం మధు పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్సీపురంలో మే డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల, నీలం మధు ముఖ్య అతిథులుగా హాజరై ఉమ్మడి మెదక్ ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు, వివిధ పరిశ్రమల కార్మికులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ గత పదేళ్లలో ఎన్నో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసిందన్నారు. కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లతో బుద్ధి చెప్పాలని, కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆనాడు మెదక్కు ప్రాతినిథ్యం వహించిన ఇందిరా గాంధీ జిల్లా రూపు రేఖలు మార్చారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ను గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపుతామని డీసీసీ నిర్మలాజగ్గారెడ్డి అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కార్మికులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నల్తూర్ మాజీ సర్పంచ్ పెంటయ్య ఈ సందర్భంగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ స్టేట్జనరల్ సెక్రటరీ అహ్మదుల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఓడీఎఫ్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, గణేశ్, వరుణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, సుందర్, చంద్రమౌళి పాల్గొన్నారు.