
- కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎ స్ తీరు సిగ్గుచేటు
మెదక్టౌన్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మెదక్ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్ టౌన్ లో ఇటీవల ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డికి ఆత్మీయ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ దినదినాభివృద్ధి చెందుతుందని, దీనికి ఇటీవల 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2 ఎమ్మెల్సీలు గెలుచుకోవడమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడున్నరేండ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. పదేండ్ల పాలనలో ప్రభుత్వ స్థలాలు అమ్మినోళ్లు, ఇప్పుడు భూములు ఎలా అమ్ముతారని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్కు వేలాది ఎకరాల పేదల భూములు లాక్కున్నది బీఆర్ఎస్ నే అని ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారా అని కేటీఆర్, కేసీఆర్మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అప్పులు తీసుకున్నామనే విషయాన్ని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశ్ గౌడ్, జిల్లా నేతలు గడ్డం శ్రీనివాస్, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.