అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి : ఎంపీ రఘురాం రెడ్డి

అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి : ఎంపీ రఘురాం రెడ్డి
  • కలెక్టర్ తో భేటీ.. వరద ప్రభావిత ప్రాంతాలపై చర్చ  
  • కేంద్రం నుంచి నిధులొచ్చేలా కృషి చేస్తానని వెల్లడి 

ఖమ్మం, వెలుగు :  ఇటీవల ఆకేరు, మున్నేరు, పాలేరు వరదల ప్రభావానికి గురైన లోతట్టు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో భేటీ అయి చర్చించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) వైస్ చైర్మన్ కూడా అయిన ఎంపీ, ఆ పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది వేతన విరాళ చెక్కును కలెక్టర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణకు అంచనాను రూపొందించాలని సూచించారు. ఇళ్లతో పాటు రైతుల వ్యవసాయ భూములకు కూడా నష్టం వాటిల్లిందని, నష్టం లెక్కలు సేకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు పలు రకాలుగా అండగా నిలిచిందని, తాను కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. 



కేంద్రీయ విద్యాలయం, పాఠశాలల గురించి ఆరా..!

 

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయం, ఏకలవ్య పాఠశాలల్లో పరిస్థితిపై ఎంపీ ఆరా తీశారు. ఇటీవల వరదల  ప్రభావం ఏమైనా పడిందా అంటూ వివరాలు తెలుసుకున్నారు. ఈ విద్యాలయాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిద్దామన్నారు. ఖమ్మం రూరల్​ మండలం మీదుగా వెళ్తున్న కొత్త రైల్వే లైన్ కు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.