
ముంబై: జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా క్షమించి ముందుకు సాగాలని టీమిండియా లెజెండ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. అలా చేయడం వల్ల ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించొచ్చన్నాడు. ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం ద్వారా మంచి నిద్రలేని రాత్రులను గడపొద్దని సూచించాడు.
ఐపీఎల్కు రెడీ అవుతున్న మహీ ఓ ఈవెంట్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చాడు. ‘జీవితాన్ని సింపుల్గా ఉంచుకోవాలి. మన పట్ల నిజాయితీగా ఉండాలి. మన కోసం ప్రజలు ఏం చేసినా వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది నా జన్మహక్కు అని ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించొద్దు, ఎవర్నీ అడగొద్దు’ అని సింగిల్ ఐడీ అధారిత యాప్ ‘ధోనీ’ లాంచ్ సందర్భంగా ఎంఎస్ పేర్కొన్నాడు.
వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో క్షమించే వైఖరి కలిగి ఉండాలని, ప్రస్తుతం అది కొరతగా ఉందన్నాడు. ముఖంలో చిరునవ్వు ఉంటే సగం సమస్య అక్కడే పరిష్కారమవుతుందన్నాడు. సౌకర్యవంతమైన పరిస్థితుల్లో లేకపోయినా, చేయడం కష్టమే అయినా క్షమించే శక్తి మాత్రం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని వెల్లడించాడు. కొన్ని విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం రోజువారీ జీవితంలో ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుందని మహీ తెలిపాడు.